Friday, May 3, 2024
- Advertisement -

పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ తీరు ఇలా…!

- Advertisement -

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గురివింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్న సామెతకు తగ్గట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది . చంద్రబాబు హయాంలో నెలకో శంఖుస్థాపన, వారానికో శిలాఫలకం ఆవిష్కరణ తప్ప పనుల పురోగతి లేదు. అయితే వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ హయాంలో అందుకు విరుద్ధంగా పనులు శరవేగంగా జరుగుగుతున్నాయి. మంచి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల పచ్చమీడియా కళ్ళకు కనిపించదు. వారి కళ్ళు పచ్చగా మండి పోతాయి. వారి హయాంలో చేదు ఏది జరిగిన, అసలు పనులు ఏమి జరగక పోయినా అద్భుతం, మహాద్భుతం లా కనిపిస్తాయి. తాజాగా పచ్చమీడియాలో వస్తున్న వార్తలు, వాటిని అందుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు వేస్తున్న వీరంగం చూస్తే ఇది నిజమని అర్థమౌతోంది. గత కొద్దిరోజులుగా పచ్చమీడియాలో పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, మట్టి కోతకు గురైంది, అంచనాలు పెంచారు అని రోజుకో అబద్దపు వార్త తోలి పేజీల్లో ప్రచురితమౌతోంది. వెంటనే టీడీపీ నేతల వీరంగం స్టార్ట్ అవుతోంది. అయితే ఈ వార్తల మూలాలు అన్ని పచ్చ పార్టీ ప్రభుత్వహయాంలోనివే కావటం విశేషం. పచ్చ ప్రభుత్వ హయాంలో ఇంజినీరింగ్ ప్రమాణాలకు విరుద్ధంగా పోలవరంలో చేపట్టిన పనులు, చేసిన తప్పులు ఎక్కడ బయట పడుతోందన్న భయంతో ముందుగానే గుడ్డకాల్చి మొహాన వేసి తుడుచుకోమన్నట్లుగా టీడీపీ, పచ్చ మీడియా వ్యవహరిస్తున్నాయి.

పోలవరం జలాశయం నిర్మాణానికి సంబంధించి అంచనాల పెంపు అనేది వై ఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి ఐన తరువాత జరిగింది కాదు. టి డి పీ అధికారంలో ఉన్నపుడే ఇది షురూ ఐంది. దానికి కొనసాగింపుగానే తాజాగా అంచనాలను మరికొంత పెంచారు. ఇపుడు అంచనా వ్యయం 1656 కోట్లు పెంచడంపై గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం పార్టీ, దాని తాబేదారు పచ్చ మీడియా 2016లో ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు రూ. 1500 కోట్ల అంచనా పెంపుపై నోరు మెదపడం లేదు. తాజాగా వండి వార్చుతున్న వార్తల్లో కనీసం అప్పటి అంచనాల పెంపును ప్రస్తావించటం లేదు అంటే అవి ఎంత పచ్చపాతం తో వ్యవహరిస్తున్నాయి అర్ధం అవుతుంది. పచ్చ మీడియా అయితే ప్రస్తుతం ఏదో దోపిడీ జరుగుతోందని గగ్గోలు పెడుతోంది. తాము తాబేదార్లుగా వ్యవహరించే చంద్రబాబు హయాంలో ఇదే అంచనాలు పెంచితే మాత్రం మహాద్భుతంగా ఆ పత్రికలకు కనిపించింది. ప్రస్తుతం పెరిగిన పనుల వల్ల అంచనా వ్యయం పెరిగింది. అయితే అదనపు పనులతో సంబంధం లేకుండా 2016 లో ప్రాజెక్ట్ (హెడ్ వర్స్క్) అంచనా వ్యయాన్ని 4054 కోట్ల నుంచి 5535 కోట్లకు అంటే 1481 కోట్ల రూపాయలు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

2013లో 4054 కోట్లకు అప్పటి నిర్మాణ సంస్థ పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2015-16 సవరించిన అంచనాల ప్రకారం అంచనా వ్యయం పెంచాలని అప్పటి నిర్మాణ సంస్థ కోరడంతో ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వ్యయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై అప్పట్లో వైసిపి కానీ, తెలుగుదేశం అనుబంధ మీడియా కానీ నోరు విప్పలేదు. ఇప్పుడు పెంచిన ధరలపైనే టి డీ పీ , దాని అనుకూల మీడియా గగ్గోలు పెట్టడం వారి ద్వంద నీతికి అద్దం పడుతోంది.

గ్రాఫిక్స్, అవినీతికి పోలవరం ప్రాజెక్ట్ ను కేరాఫ్ అడ్రస్ గా పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చారు. ఇపుడు గ్రాఫిక్స్ కాకుండా వాస్తవ నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ అవినీతికి ఏ టి ఎం గా మారలేదు. దీంతో కక్షకట్టిన పచ్చమీడియా, పచ్చ పార్టీ ఒక పధకం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్పై విషపు దాడికి పూనుకున్నారు. తమ హయాంలో జరిగిన అవినీతిని ఇప్పటి ప్రభుత్వం పై , కాంట్రాక్టు సంస్థపై వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గత వారం రోజులుగా పచ్చ నాయకులు, వీరికి వంతపాడే పచ్చమీడియా ఇదే విషయమై నానా యాగీ చేస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పర్యవేక్షణ బాద్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. అంచనాలను పెంచాలన్నా, సవరించాలన్నా కేంద్ర జలసంఘం ఆమోదం తప్పక తీసుకోవాలి. ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం కేంద్ర జలసంఘం ఆదీనంలోని ప్రత్యేక అథారిటి పర్యవేక్షణలో జరుగుతోంది. నిర్మాణంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, అంచనాలు సవరించాలన్న ఈ అథారిటీ నిర్ణయమే ఫైనల్. ప్రపంచంలోనే అతిపెద్ద వరద డిశ్చార్జ్ కలిగిన ప్రాజెక్ట్ కావడంతో డిజైన్లు కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలే నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. గత రెండేళ్లుగా సంభంవించిన భారీ వరదలకు చంద్రబాబు ణొన్ ఇంజనీరింగ్ నిర్ణయాల వల్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ పలుచోట్ల దెబ్బతింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాంలతో పాటు మట్టి కట్టలు కోతకు గురయ్యాయి.

వీటిని దృష్టిలో ఉంచుకొని 50 లక్షల క్యుసెక్కుల వరద వచ్చినా తట్టుకొని స్పిల్ వే మీదుగా వరద సులభంగా పారేందుకు నిర్మాణ పనుల్లో, డిజైన్లలో కేంద్ర జలసంఘం తరచూ మార్పులో చేస్తోంది. . ఈ మార్పుల వల్ల పని పరిమాణం పెరుగుతోంది.డిజైన్ మార్పు వల్ల ఒక్క అప్రోచ్ ఛానెల్ లోనే దాదాపు కోటి ఇరవై లక్షల ఘనపు మీటర్ల మట్టిని అదనంగా తవ్వాల్సి వస్తోంది. తొలుత వేసిన అంచనా కన్నా ఇది నాలుగు రెట్లు అధికం. కేంద్రం ఇలా డిజైన్లలో, పనుల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. పెరిగిన అంచనాలు, అందుకు గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే టీడీపీ దాని అనుకూల మీడియా సృష్టిస్తున్న అబద్దాలు నిజం కాదని అర్ధం అవుతుంది.

గతంలో అనుమతించిన పనులు కొనసాగుతుండగా , కేంద్ర జలసంఘం అనుమతించిన నూతన పనులకు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిసియల్ రివ్యూ కమిటీ ఆమోదం తరువాత టెండర్లు పిలిచింది. వీటి విలువ 683 కోట్ల పనులు.. డిడిఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను ఇటీవల పరిశీలించి పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రతకోసం మరి కొన్ని కొత్త డిజైన్లు సూచించారు. పాత అగ్రిమెంట్ కు అదనంగా కొత్త పనులు జత అవ్వడంతో ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. కేంద్ర జలసంఘం ఆమోదంతోనే వీటిని అదనంగా చేర్చారు.

అదనపు పనులు ఇవే….
పోలవరం ప్రాజెక్టులో 683 కోట్లతో స్పిల్ ఛానల్ ఎండ్ కటాఫ్ వాల్, గ్యాప్ 2 లో నేలను గట్టి పరిచే పనులు, గ్యాప్ 1, 3లో డ్యామ్ ల నిర్మాణం, స్పిల్ వే కుడి, ఎడమ కొండల పటిష్టత వంటి పనులు ఇపుడు చేపట్టనున్నారు. స్పిల్ ఛానల్ చివర 12 మీటర్ల లోతు, 1354 మీటర్ల పొడవున ఎండ్ కటాఫ్ వాల్ ను నిర్మించనున్నారు. స్పిల్ ఛానెల్లో నిర్మించే కాంక్రీట్ బ్లాకులు, మట్టి స్పిల్ వే నుండి వచ్చే భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఒక వేళ స్పిల్ వే నుండి విడుదల చేసే భారీ వరద ప్రవాహా వేగానికి కాంక్రీట్ బ్లాకులు, మట్టి కొట్టుకుపోయినా ఈ డయా ఫ్రం వాల్ అడ్డుకుంటుంది. దీనిని 83.17కోట్లతో నిర్మించనున్నారు.

గ్యాప్-2లో నేలను గట్టిపరిచే పనులు
ప్రాజెక్టులో అతికీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మించాలంటే ముందుగా నదీగర్భంలోని ఇసుకను దాదాపు 100 అడుగుల లోతునుండి గట్టిపరచుకుంటూ నేలను రాయిలాగా మార్చాలి. దీనినే వైబ్రోకాంపాక్షన్ అంటారు. ఇలా నేలను గట్టి పరుస్తూ ఆ గ్యాప్ లో ఇసుక ను నింపుతారు. మారిన డిజైన్ల ప్రకారం ఇటుకతో పాటు కంకరను ఇందులో నింపాలి. దీనినే స్టోన్ కాలమ్స్ గా పిలుస్తారు. భూమిని లోతు నుండి గట్టిపరచుకుంటూ చేసే పనులనే డీప్ సాయిల్ మిక్సింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల భూమిలోపల ఖాళీ ప్రదేశం లేకుండా రాయిలాగా గట్టిగా మారుతుంది. ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం దీనిపైనే నిర్మిస్తారు. ఇలా చేయడం వల్ల ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కట్టిన తరువాత బొట్టు నీరు కూడా నదీగర్భంలోనుండి దిగువకు లీకు అవ్వకుండా అడ్డుకోవడంతో పాటు దాని పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పనులకు కేంద్రజలసంఘం సూచనల మేరకు 211.12కోట్లతో కొత్తగా టెండర్ పిలిచారు.

గ్యాప్-1,మరియు గ్యాప్-3 లలో ఢ్యాంల నిర్మాణం
రివర్స్ టెండరింగ్ లో పోలవరం హెడ్ వర్క్స్ పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరంగ్ తో ఏ పీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం గ్యాప్-1లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలి . కేంద్రజలసంఘం నిపుణులు 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించారు. ఇందుకు భూమిలోపల నుండి ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించడంతో పాటు, స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ పనులకు సైతం 242.87 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. ఇలా ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం, స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు చేయడం వల్ల నీరు ఎక్కడా కూడా లీక్ కాదు. పక్కనే ఏర్పాటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్ట్ కు కూడా ఇది రక్షణ కవచం లా ఉంటుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం లో గ్యాప్-3లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలి. ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని నిపుణులు సూచించారు దీని నిర్మాణానికి 11.64 కోట్లతో టెండర్లు పిలిచారు.

స్పిల్ వే కుడి,ఎడమ కొండలకు రక్షణ చర్యలు
స్పిల్ వే బ్రిడ్జికి కుడి, ఎడమ పక్కన ఉన్న కొండ చరియలు విరిగి పడిపోకుండా గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు, కేంద్రజలసంఘం సూచనల మేరకు 134.21 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు.. పైన పేర్కొన్న వాటితో పాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెరిగిన అంచనాలకు టెండర్లు ఆహ్వానించింది. పోలవరం ప్రాజెక్టు అనుకున్నసమయానికే పూర్తి అయితే పేరు వైసీపీ ప్రభుత్వంకు వెళ్ళిపోతుందనే అక్కసుతో పచ్చపార్టీ నేతలు మొదటి నుంచి దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతటి దుష్ప్రచారం చేసినా ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసి ఆంధ్రుల చిరకాల వాంచను నెరవేర్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -