ఈ మద్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మునుగోడు బైపోల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ ఉపఎన్నిక ముందు చోటు చేసుకున్నా అనేక పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజలు సైతం చర్చించుకునే విధంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీలో ఉన్న బీజేపీ టిఆర్ఎస్ నేతల మద్య పేలిన మాటల తుటాలు, ప్రజలకు పంచిన రకరకాల తాయిలలు, డబ్బు తీసుకుంటాం.. నచ్చిన వారికే ఓటు వేస్తాం అని ప్రజలు క్లారిటీగా చెప్పడం, ఇలా చాలానే అంశాలు మునుగోడు వైపు దేశ ప్రజలు చూసేలా చేశాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం ఎంతటి సంచలనం అయిందో అందరం చూశాం. .
ఇలా రకరకాల అంశాలు మునుగోడు బైపోల్ ను హాట్ టాపిక్ గా మార్చాయి. అయితే మునుగోడు విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేసినప్పటికీ ప్రజలు మాత్రం అధికార టిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. మరి మునుగోడు టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కానప్పటికి ఎలా గెలిచింది ? అసలు టిఆర్ఎస్ కు బలమే లేని చోట ఎలా పాగా వేయగలిగింది ? మునుగోడు ప్రజలు ఎందుకు టిఆర్ఎస్ ను నమ్మారు ? అసలు టిఆర్ఎస్ విజయనికి దారితీసిన పరిణామాలు ఎంటో ఒకసారి చూద్దాం !
ముఖ్యంగా మునుగోడు బైపోల్ ను కేసిఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనని కేసిఆర్ మునుగోడులో మాత్రం రెండుసార్లు బహిరంగ సభలలో పాల్గొని, ప్రజలు దృష్టి టిఆర్ఎస్ వైపు ఉండేలా చూశారు. అలాగే బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు కేసిఆర్ తన రాజకీయ చతురత కు పదునుపెట్టి.. పక్కా ప్రణాళికబద్దంగా వ్యూహాలు రచించి అమలు చేశారు. మునుగోడులో అధిక ప్రభావం చూపే కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కూడా టిఆర్ఎస్ కు కలిసొచ్చింది.
మునుగోడు నియోజిక అభివృద్ది తమతోనే సాధ్యమని బలంగా చెబుతూ అంతే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది టిఆర్ఎస్. చుండూరు రెవెన్యూ డివిజన్, శివన్నగూడెం, కిష్టారాయంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ల పూర్తి చేస్తామంటూ ఇచ్చిన హామీలు మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ వైపు చూసేలా చేశాయి. అంతే కాకుండా రైతుబంధు, రైతుభీమా, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల చర్చ తరచూ ప్రజల్లో ఉండేలా చూసుకున్నారు టిఆర్ఎస్ నేతలు.
ఇక అన్నిటికంటే ముఖ్యం టిఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజిక వర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటిఆర్ ప్రకటించడంతో ఒక్కసారిగా మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఈ దత్తత హామీని టిఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారనే విమర్శను టిఆర్ఎస్ గట్టిగా ప్రస్తావించింది. ప్రజలు కూడా దీన్ని నమ్మారు. ఫలితంగా ఈ కీ ఫ్యాక్టర్స్ అన్నీ మునుగోడులో టిఆర్ఎస్ విజయ ధూందూది మోగించడానికి కారణం అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !