పాదయాత్రలో జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై జగన్ స్పందించారు. ప్రభుత్వం మహిళల, ఆడపిల్లల కష్టాలు పట్టించుకోనప్పుడు, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని మనిషి బరితెగించినప్పుడు ఏ వ్యక్తయినా మృగం అవుతాడని అన్నారు.
ముఖ్యమంత్రే దళారిగా మారి అక్రమాలు చేస్తున్నారన్న వైఎస్ జగన్.. సినిమాలో చంద్రబాబు నటించి ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం కచ్చితంగా ఉత్తమ విలన్ అనే అవార్డు ఆయన సొంతం చేసుకునేవారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. నాలుగేళ్లుగా మహిళలపై 281 లైంగిక దాడులు జరిగాయని, గత 4 రోజుల్లో 11 ఇలాంటి కేసులు నమోదైనా పట్టించుకోని కారణంగా మృగాళ్లుగా మారుతున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మార్వో వనజాక్షి తన పని తాను సక్రమంగా చేస్తోంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారని, ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా చంద్రబాబు ఆయనను కాపాడారని జగన్ అన్నారు. ర్యాగింగ్ భరించలేక రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే నిందితుల పట్ల చట్టాలు చుట్టాలుగా వ్యవహరించేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోలేదని, ఆ కేసును అధిక వడ్డీ కేసులుగా మార్చేశారని జగన్ అన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు వెక్కిలి నవ్వులు నవ్వారని, ఇటువంటి ఎన్నో ఘటనలకు ప్రభుత్వమే పాల్పడుతుంటే మనుషులు మృగాళ్లు కారా? అని జగన్ నిలదీశారు.