హుజూరాబాద్ ఎన్నికలో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘ హుజూరాబాద్ ఎన్నికలో మా పార్టీ పోటీచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడెకరాల భూమి వస్తుందా? పేదప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? కేవలం ప్రతీకారం కోసమే ఈ ఎన్నికలు వచ్చాయి. మేం ఎందుకు పోటీచేయాలి’ అంటూ షర్మిల ప్రశ్నించారు. ప్రస్తుతం హూజూరాబాద్ ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ఎన్నికను బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీచేస్తారని భావించిన పాడి కౌశిక్రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పరిస్థితి రసకందాయంలో పడింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Also Read: ‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్కు కావాలి..! రాహుల్ గాంధీ..!
ఇక టీఆర్ఎస్ కూడా ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. పాడి కౌశిక్రెడ్డి లేదా ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన ఎల్ రమణకు టికెట్ దక్కే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక లో పోటీచేయడం లేదంటూ షర్మిల ప్రకటించారు. నిజానికి షర్మిల కొద్దిరోజుల క్రితమే పార్టీ పెట్టారు. అంతలోనే ఈ ఎన్నిక వచ్చి పడింది. అక్కడ క్యాడర్ను ఇంకా సమాయత్తం చేసుకోలేదు. పాదయాత్ర అనంతరం తన పార్టీలోకి చేరికలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని షర్మిల భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హుజూరాబాద్ ఎన్నికలో పోటీచేయకపోవడం ఉత్తమమని భావించినట్టున్నారు.
Also Read: వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!