టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే ఎమోషనల్ అయిపోయాడు. బ్రిస్బేన్లో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘ అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. మాటలు రావడం లేదు. అడిలైడ్ టెస్టు ఓటమి తర్వాత ప్రతీ ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడాడు. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. రిషభ్, నట్టు(నటరాజన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, పుజారా మంచి ప్రదర్శన కనబరిచారు. అశ్విన్ ఆకట్టుకున్నాడు అని జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు.
కాగా పింక్బాల్ టెస్టులో ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇండియాకు రాగా.. రహానే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. వరుసగా సీనియర్ ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ ఆత్మవిశ్వాసంతో జట్టును ముందుండి నడిపించాడు. యువ ఆటగాళ్ల తోడ్పాటుతో విజయాలు సాధించి ఈ టూర్ను మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు.
ఇక రహానే సారథ్యంలో బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన టీమిండియా, సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది. చివరిదైన గబ్బా టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలుపొంది 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మరోసారి భారత్ పరమైంది. ఈ క్రమంలో రహానే కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతి ఒక్కరు అతడిని కొనియాడుతూ భవిష్యత్ కెప్టెన్ అని కితాబు ఇస్తున్నారు.