ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంతర్జాతీయ అత్యున్నత స్పోర్ట్ ఈవెంట్ నిర్వహణకు ప్రయత్నాలు ఆరంభించినట్టుగా తెలుస్తోంది.
భారత్ లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు ఆయన ప్రయత్నాలు ఆరంబించినట్టుగా సమాచారం. ఈ మేరకు భారత్ ఐఓసీతో సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. బిడ్డింగ్ లో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకొంటూ ఒలింపిక్స్ నిర్వహణ అవకాశాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయనున్నట్టు సమాచారం.
2016లో ఒలింపిక్స్ బ్రెజిల్ లో జరుగుతాయి. 2020లో టోక్యో వేదికగా ఈ క్రీడా పండగ జరుగుతుంది. 2024 లో జరిగే ఒలింపిక్స్ కు ఇంకా వేదిక ఖరారు కాలేదు. ఆ అవకాశం కోసం భారత్ ప్రయత్నాలు చేయనుంది. విశేషం ఏమిటంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహణ ప్రయత్నాలు చేయడం. అహ్మదాబాద్ ను వేదికగా చూపుతూ భారత ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది.
మరి ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రానికే చెందిన వాడు కావడం.. ఒలింపిక్స్ కూడా గుజరాత్ లో నిర్వహించే ప్రయత్నాలు చేయడం విశేషమే అవుతుంది. అయితే భారత్ తో పాటు 2024 ఒలింపిక్స్ కోసం చాలా దేశాలే పోటీలో ఉన్నాయి. రోమ్ వేదికగా ఈ క్రీడలను నిర్వహించడానికి ఇటలీ ప్రయత్నిస్తుండగా.. బోస్టన్ వేదికగా 2024 ఒలింపిక్స్ కోసం అమెరికా బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇవేగాక కెన్యావంటి దేశాలు కూడా తమకు అవకాశాన్ని అడుగుతున్నాయి. మరి వీటి మధ్య అహ్మదాబాద్ ఏ మేరకు నెగ్గుకొస్తుందో చూడాలి!