భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆటపై పట్టు బిగించింది. సిడ్నీ వేదికగా జరుగుతోన్న ఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ నమోదు చేసి ఆస్ట్రేలియాకు సవాల్ విసిరింది. భారత్ బ్యాట్స్మెన్లు కదం తొక్కడంతో కోహ్లీసేన 622/7 వద్ద డిక్లేర్ చేసింది.
చివరి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా 303/4 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కోహ్లీ సేన మరో 319 పరుగులు జోడించింది. పుజారా(193), రిషబ్ పంత్(159; నాటౌట్) రాణించడంతో ఆసీస్ ముందు టీమిండియా భారీ స్కోరును నిలిపింది.
373 బంతుల్లో 193 పరుగులు చేసిన పుజారా డబుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఔటయ్యాడు.పుజారా ఔటైనా భారత జట్టు స్కోర్ వేగం మాత్రం తగ్గలేదు. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా స్కోర్ బోర్డ్ను పరుగులు పెట్టించారు. 7వ వికెట్కు 204 పరుగులు జోడించి భారత్ జట్టు స్కోర్ 600 పరుగుల మార్క్ దాటడంలో కీలక పాత్ర పోషించారు.
టీమిండియా డిక్లెర్ అనంతరం తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు డిఫెన్స్కే పరిమితమైంది. ఓపెనర్లు మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖవాజా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లిద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో ఆసీస్ టీమ్ 10 ఓవర్లో 24 పరుగులే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ కంగారూ టీమ్ ఇంకా 598 పరుగులు వెనుకబడి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆసిస్ జట్టు గెలిచే అవకాశాలు లేవు. ఈ టెస్ట్ మ్యాచ్ను గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ను గెలిచి కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం 2-1తో భారత జట్టు సిరీస్ ఆధిక్యంలో ఉంది.