ఆసిస్తో టెస్ట్ సిరీస్ గెలిచి ఊపు మీదున్న టీమిండియా వన్డేపై కూడా కన్నేసింది. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన బూమ్రాకు వన్డే సిరీస్లో సెలక్టర్లు విశ్రాంతి నిచ్చారు. బూమ్రా స్థానంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్ జట్టులోకి రానున్నారు. ఆసీస్తో వన్డే సిరీస్కు సంబంధించి జట్టును గతంలోనే ప్రకటించినప్పటికీ, కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో సిరాజ్ను ఎంపిక చేసింది బీసీసీఐ.
వచ్చే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని పేసర్లపై పనిభారం తగ్గించాలని కోహ్లి, కోచ్ రవిశాస్త్రి బీసీసీఐకి సూచనకు బీసీసీఐ ఒప్పుకుంది. ఆసీస్ వన్డే సిరీస్తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు బూమ్రాకు విశ్రాంతి ఇస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడిన సిరాజ్.. ఆసీస్తో వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే సమయంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సిద్ధార్ధ్ కౌల్కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. ఆసిస్ టూర్ ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 23 నుంచి కివీస్ గడ్డ మీద ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.