కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో గురువారం బంగ్లాదేశ్పై టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మంగళవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక జట్టు చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన భారత్.. టోర్నీలో ఈరోజైనా బోణి కొట్టాలని ఆశిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా పసికూన ముద్రని చెరిపేసుకునేందుకు ఈ టోర్నీని వినియోగించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
శ్రీలంకతో మ్యాచ్లో బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారత్ 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయినప్పటికీ.. తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో మార్పు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో అదే జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ బరిలోకి దిగుతోంది. మరోవైపు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ గాయం కారణంగా జట్టుకి దూరమవడంతో తాత్కాలిక కెప్టెన్ మహ్మదుల్లా నాయకత్వంలో బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడుతోంది.
బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ మెరుపులూ తోడైతేనే టీమిండియాది పైచేయి అవుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ నుంచి త్వరగా బయటపడి కీలక ఇన్నింగ్స్ నమోదు చేయాల్సి ఉంది. బౌలింగ్లో తొలి మ్యాచ్లో సుందర్ మినహా అందరూ తేలిపోయారు. పేసర్లు శార్దుల్, ఉనాద్కట్ ప్రభావం చూపకపోవడంతో పార్ట్ టైమర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. వీరితో పాటు చహల్ కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో ఎటువంటి మార్పులో లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది.