సొంతగడ్డపై వరుస వైఫల్యాల అనంతరం భారత్ ఎట్టకేలకు ఓ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ మునుపటి జోరు కొనసాగించి ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.
208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. సూపర్ ఫామ్లో ఉన్న స్మృతి మంధాన(86: 109 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో టీమిండియాకు విజయాన్ని అందించింది.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ మంధాన సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. ఆమెకు జతగా హర్మన్ ప్రీత్ కౌర్(21), దీప్తి శర్మ(24)లు మోస్తరుగా ఆడి విజయానికి సహకరించారు.
అంతకముందు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 49. 3 ఓవర్లలో 207 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో డానియల్లీ వ్యాట్(27), బీమౌంట్(37), నటాలీ స్కీవర్(21), డానియెల్లీ హజెల్(33)లు ఫర్వాలేదనిపించగా, ఫ్రాన్ విల్సన్(45) ఆకట్టుకుంది.తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఇంగ్లండ్ పదిహేను పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఆపై ఫ్రాన్ విల్సన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ను ఆదుకుంది.
భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ నాలుగు వికెట్లు, ఏక్తా బిస్త్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, దీప్తి శర్మకు రెండు వికెట్లు, జులన్ గోస్వామి వికెట్ తీశారు.