కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడం పట్ల ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరును ఛేదించలేక గంభీర్ సేన చితికిలపడింది. 144 పరుగుల టార్గెట్ ను కూడా తాము ఛేదించలేదని గుర్తు చేసిన ఆయన, ఇలాగైతే పాయింట్ల పట్టికలో ముందుకెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ 4 పరుగుల తేడాతో ఓడింది.
మొదటి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడం తమ కొంప ముంచిందని త్వరగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్థికి మ్యాచ్పై పట్టు చిక్కిందన్నారు గంభీర్. మిడిల్ గేమ్ లో పరుగులు చేసినా, క్రమంగా వికెట్లు పడిపోవడంతో గెలుపు అవకాశాలు దగ్గర కాలేదని చెప్పాడు.
అయితే, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా బ్యాటింగ్ లో రాణించడం భవిష్యత్తుకు శుభ పరిణామమని చెప్పాడు. కేవలం 10 బంతుల్లో 22 పరుగులు చేసిన పృథ్వీని అభినందించిన గంభీర్, ఇక తదుపరి మ్యాచ్ లపై దృష్టిని పెట్టనున్నట్టు వెల్లడించాడు.