దినేష్ కార్తిక్ బ్యాటింగ్ మెరుపులతో ఉత్కంఠ ఫైనల్లో బంగ్లాదేశ్తో జరిగిని నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో త్రిల్లింగ్ విజయాన్ని నమమోదు చేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి బంతికి విజయానికి ఐదు పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 27) సిక్సర్ బాది భారత్ను గెలిపించాడు. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు రోహిత్ శర్మ (42 బంతుల్లో 56), శిఖర్ ధావన్ (10) మెరుపు ఆరంభాన్నిచ్చారు. కానీ ధావన్, రైనా (0) వెనువెంటనే అవుటవడం స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది.
లోకేశ్ రాహుల్ (14 బంతుల్లో 24)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ముందుకు నడిపాడు. కానీ జట్టు స్కోరు 83 పరుగుల వద్ద రాహుల్ అవుటవడంతో రోహిత్ ఆచితూచి ఆడాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు ఆడే క్రమంలో హిట్ మ్యాన్ నజ్ముల్ ఇస్లాం బౌలింగ్లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటికీ భారత్ విజయానికి 40 బంతుల్లో 69 పరుగులు అవసరం. దీంతో భారత్పై ఒత్తిడి పెరిగింది. అప్పటి వరకూ మెల్లగా ఆడిన మనీష్ పాండే (18) ధాటిగా ఆడేందకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రోహిత్ స్థానంలో క్రీజ్లోకి వచ్చిన విజయ్ శంకర్ ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ చివర్లో ఒత్తిడికి లోనయ్యాడు. చివరి 3 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ముస్తాఫిజుర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విజయ్ శంకర్కు వరుసగా నాలుగు డాట్ బాల్స్ విసరడంతోపాటు ఒక పరుగు మాత్రమే ఇచ్చి మనీష్ పాండే వికెట్ పడగొట్టాడు.
తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజ్లోకి వచ్చిన దినేశ్ కార్తీక్ తర్వాతి ఓవర్లో వరుసగా 6,4,6,0,2,4 బాది 22 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. సౌమ్య సర్కార్ విసిరిన ఆఖరి ఓవర్లో ఎట్టకేలకు విజయ్ శంకర్ బౌండరీ బాదడంతో సమీకరణం రెండు బంతుల్లో 5 పరుగులుగా మారింది. కానీ ఐదో బంతికి విజయ్ క్యాచ్ అవుటయ్యాడు. చివరి బంతికి దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 29) సిక్స్ బాది భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసిన బంగ్లా.. సబ్బీర్ రహ్మాన్ (50 బంతుల్లో 77; 7×4, 4×6) పోరాటంతో కోలుకుంది. చివర్లో మెహదీ హసన్ (7 బంతుల్లో 19) మెరుపులు మెరిపించడంతో ఊహించని విధంగా 166 రన్స్ చేసింది. భారత బౌలర్లలో చాహల్కు 3 వికెట్లు దక్కగా, ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు.
స్పిన్నర్లు చహల్ (3/18), సుందర్ (1/20) పవర్ ప్లేలో బంగ్లా (40/3)ను కట్టడి చేశారు. వీరి శ్రమకు పేసర్లు జతయితే బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేది. కానీ విజయ్ శంకర్ (0/48), శార్దుల్ ఠాకూర్ (0/45) ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో బంగ్లాదేశ్ పోరాడే లక్ష్యాన్నే భారత్ ముందుంచింది.