టీమిండియా మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ శిక్షణలో యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. ప్రధానంగా అండర్-19 వరల్డ్ కప్ లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నారు. వరుస భారీ విజయాలతో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది.
సెమీస్ లో పాకిస్ధాన్ పై భారీ విజయం సాధించిన తరువాత భారత్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దానికి కారణం ఏంటంటే..తాజా అండర్–19 వరల్డ్ కప్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన యంగ్ ఇండియా జట్టు వందకు పైగా పరుగుల తేడాతో మూడు, 10 వికెట్ల తేడాతో రెండు మ్యాచ్ లలో విజయం సాధించి, ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలిచింది.
ప్రస్తుతం ఫైనల్ కు చేరిన ఆస్ట్రేలియా జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన భారత జట్టు ఆ మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని ఓడించింది. పపువా న్యూ గునియాతో జరిగిన రెండో మ్యాచ్ లో 10 వికెట్లతో ప్రత్యర్ధిపై భారత్ విజయం సాధించింది. ఇక మూడో వన్డేలో పసికూన జింబాబ్వే జట్టుపై 10 వికెట్లతో భారీ విజయం సొంతం చేసుకుంది.
నాలుగో మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్) లో బంగ్లాదేశ్ పై 131 పరుగుల భారీ తేడాతో గెలిచింది. నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై 203 పరుగుల భారీ విజయం సాధించింది. దీంతో ఫైనల్ లో కూడా భారతే విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.