భారత దేశ చరిత్రలో తొలిసారిగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సిట్టింగ్ జడ్జీపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అనుమతించారు.
జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించినా, ఆయన సిట్టింగ్ జడ్జి కావడంతో, సీబీఐ విచారణ చేపట్టాలంటే చీఫ్ జస్టిస్ అనుమతి తప్పనిసరైంది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణకు అనుమతిస్తున్నట్లు గొగోయ్ వెల్లడించారు.
అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న శుక్లాను తొలగించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ ఇదివరకే కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. సీబీఐ విచారణపై మరో ఉన్నత న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్పందిస్తూ, జస్టిస్ శుక్లా వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే స్వచ్ఛంద పదవీవిరమణను ఎంచుకోవచ్చని సూచించారు.