ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది.
పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తర్వాత ఐదుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ వచ్చింది. కాని వీరిని నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ చేశారని.. అక్రమంగా పదోన్నతులు ఇచ్చారని తేల్చారు. అప్పటి నుంచి వారి వేతనాలు నిలిపివేయడంతో ఉద్యోగులు 2015లో హైకో ర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లకు జీతాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కోర్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్కు శిక్ష, జరిమానా విధించింది.
ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.