ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. ఫిబ్రవరి 14న అమరావతిలో ఈ భేటీ జరగనుంది. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయనగా వీరిద్దరూ సమావేశమవుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పటివరకు హైదరాబాద్లోని లోటస్పాండ్ కేంద్రంగా పార్టీని నడుపుతున్న జగన్.. తన మకాన్ని అమరావతికి షిఫ్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన గృహ ప్రవేశ కార్యక్రమం ఫిబ్రవరి 14న జరగనుంది. ఇప్పటికే జగన్ ఫోన్లో కేసీఆర్ను ఆహ్వానించారని తెలుస్తోంది. కేసీఆర్తో పాటు కేటీఆర్, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. కేసీఆర్ ఫిబ్రవరి 14న విశాఖ శారదపీఠంలో విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అటునుంచే అమరావతి రానున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్పై కేటీఆర్- జగన్ చర్చించారు. మరోసారి కీలక నేతలంతా ఒక్క చోట కలుస్తుండటంతో భవిష్యత్ రాజకీయాలపై తప్పక చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ భేటీ కూడా ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో భాగమేనని చర్చ నడుస్తోంది.