కాంగ్రెస్, టీడీపీలపై సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ వేదికగా టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల 3 నెలల పాలనలో ఒక మంత్రిగా మీ ముందుకు వచ్చానని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీయే స్వయంగా కేసీఆర్ దేశంలో ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. గతంలో తెలంగాణాలో ప్రభుత్వాన్ని నడిపే సమర్ధుడైన నాయకుడు లేరని కొంత మంది విమర్శించారని, ఆ మాటలు తప్పని కేసీఆర్ నిరూపించారని అన్నారు.
ఇప్పటివరకు ఏడు సర్వేలు వెల్లడైతే ఆరింటిలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిందన్నారు. ఇక డిసెంబర్ 7న అసలు సర్వే రావాల్సి ఉందని.. అందులోనూ టీఆర్ఎస్ అసాధారణ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఒకవేళ టీఆర్ఎస్ అదికారంలోకి రాకపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
గత పాలకులు ఇసుక ఆదాయాన్ని దోచుకున్నారని.. 2004 నుంచి 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39.04 కోట్లు మాత్రమే అన్నారు. కానీ టీఆర్ఎస్ వచ్చాక ఏటా రూ.500కోట్లు ఇసుకపై ఆదాయం వస్తుందన్నారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయితీలుగా మార్చామని గుర్తుచేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి అవసరమైన మార్పులు చేస్తామని చెప్పారు.
టీడీపీవి అవకాశవాద రాజకీయాలన్నీ.. ఏ పార్టీనైతే బంగాళాఖాతంలో కలిపేయాలనే ఎన్టీఆర్ ఆశించారో.. అదే పార్టీతో ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుందని కేటీఆర్ అన్నారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు వైసీపీతో కూడా పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని కేటీఆర్ అన్నారు. మరో 15 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. తాను మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు కేసీఆర్ దయవల్లే తాను మంత్రినయ్యానని, ఈ పదవే తనకు పెద్దదని తాను భావిస్తున్నానని తెలిపారు.