ఐపీఎల్ సీజన్ 12 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఢిల్లీని చెన్నై చెడుగుడు ఆడుకుంది. అపార అనుభవం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఏడేండ్ల తర్వాత నాకౌట్ దశకు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లో ఊహించినట్లే చెన్నైదే పైచేయి అయింది. సూపర్ కింగ్స్ సీనియారిటీ ముందు జూనియర్ ఢిల్లీ విలవిల్లాడింది.
విశాఖపట్నం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో డుప్లెసిస్ (50: 39 బంతుల్లో 7×4, 1×6), షేన్ వాట్సన్ (50: 32 బంతుల్లో 3×4, 4×6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ముంబయ్ జట్టు ఫైనల్కు చేరగా ….ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకి ఆ టీమ్తో టైటిల్ కోసం ధోనీసేన తుదిపోరులో ఢీకొననుంది.
32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరో ఓపెనర్ షేన్ వాట్సన్, అమిత్ మిశ్రా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 11, ధోనీ 9 పరుగులు చేసి అవుట్ అయినా 20 పరుగులు చేసిన అంబటి రాయుడు లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ బ్యాటింగ్లో సైకిల్ స్టాండ్ను తలపించివరుసగా వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగుల స్పల్ప స్కోరు నమోదుచేసింది.ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ (38: 25 బంతుల్లో 2×4, 1×6), కొలిన్ మున్రో (27: 24 బంతుల్లో 4×4) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.చెన్నై బౌలర్లలో బ్రేవో, చహర్, జడేజా,హర్భజన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.