పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. వామన్ రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. న్యాయవాదుల దంపతుల హత్య కేసుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసు ఘటనా స్థలాన్ని తెల్లవారు జామున 2.30 గంటలకు నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి కల్వచర్లకు చేరుకుని సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై రామగుండం సీపీని అడిగి తెలుసుకున్నారు. మంథని సీఐ మహేందర్ను నేర ప్రదేశం వద్ద ఇంఛార్జిగా ఉంచి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించాలని ఆదేశించినట్లు సీపీ వివరించారు. ఇదిలా ఉంటే.. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సీన్ ఆఫ్ అఫెన్స్ స్పాట్ను సేఫ్ గార్డ్ చేయలేదని ఆరోపించిన తర్వాత పోలీసులు చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గిన బంగారం.. అదేబాటలో వెండి!