తిరుపతిలో టీడీపీ కార్యకర్త మద్యం మత్తులో చేసిన హల్చల్ తీవ్ర కలకలం రేపింది. తిరుపతి బైరాగిపట్టెడలోని కేశవయన కుంట వద్ద యశ్వంత్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త నడిరోడ్డుపై కారు నిలిపి మద్యం సేవిస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రద్దీ రహదారిపై ఇలా ప్రవర్తించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో పేషెంట్ను తరలిస్తున్న ఓ కారుకు దారి ఇవ్వాలని స్థానికులు కోరగా, యశ్వంత్ చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రశ్నించినందుకే వారిపై దాడి చేయడానికి యత్నించడంతో పాటు కత్తి చూపిస్తూ నడిరోడ్డుపై బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అతని ప్రవర్తనతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది.
ఈ అరాచకాలను గమనించిన స్థానికులు సెల్ఫోన్లలో వీడియోలు రికార్డు చేశారు. యశ్వంత్ చౌదరి మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రజల భద్రతను లెక్కచేయకుండా, రాజకీయ కార్యకర్త హోదాను అడ్డుపెట్టుకుని ఇలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
