అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న కాల్పుల విరమణ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ అమెరికా ప్రతిపాదించిన షరతులకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. “ఇరానియన్లు మా షరతులను అంగీకరించే స్థితికి రాలేకపోయాం” అని తెలిపారు.
శనివారం సుమారు 15 గంటలపాటు జరిగిన చర్చల తర్వాత కూడా రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ చర్చలు ఆదివారం కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కొనసాగనున్నాయి.
ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది హార్ముజ్ సముద్ర మార్గం (Strait of Hormuz). ఈ జల మార్గంపై పూర్తి నియంత్రణ తమదే కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. అమెరికా ప్రతిపాదించిన ‘సంయుక్త నియంత్రణ’ (joint control) ఆఫర్ను ఇరాన్ తిరస్కరించింది. అంతేకాకుండా, లెబనాన్లో ఇజ్రాయెల్ యుద్ధ చర్యలు ఆపాలని, అలాగే అమెరికా తమ ఆస్తులను అన్ఫ్రీజ్ చేయాలని కూడా డిమాండ్ చేసింది.
ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. హార్ముజ్ మార్గాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తామని ప్రకటించారు. అమెరికా నౌకాదళం ప్రకారం, ఈ ఘర్షణ ప్రారంభమైన తర్వాత మొదటిసారి రెండు యుద్ధ నౌకలు హార్ముజ్ మార్గాన్ని దాటాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. హార్ముజ్లోకి ప్రవేశించే సైనిక నౌకలపై “తీవ్రంగా చర్యలు తీసుకుంటాం” అని పేర్కొంది. అయితే, పౌర నౌకలు మాత్రం తమ సైన్యంతో సమన్వయం చేసుకుంటే వెళ్లవచ్చని తెలిపింది. రెండు అమెరికా నౌకలు హార్ముజ్ దాటినట్టు వచ్చిన వార్తలను కూడా ఇరాన్ ఖండించింది.
చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతుండటంతో పరిష్కారం ఎప్పుడు సాధ్యమవుతుందన్నది అనిశ్చితంగా ఉంది.
