మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని హనుమాన్గంజ్ ప్రాంతంలో బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షల కారణంగా ఒక యువకుడిపై ప్రత్యర్థి గ్యాంగ్ కత్తితో దారుణంగా దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితుడు తన పని మీద వెళ్తుండగా, ముందే మాటు వేసిన నిందితులు ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమైన యువకుడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాథమిక విచారణ ప్రకారం, ఇది రెండు రౌడీ ముఠాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలను మనసులో ఉంచుకునే ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. హనుమాన్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో హనుమాన్గంజ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేశారు.
