ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఐదు సంతకాలు పెట్టారని తెలిపారు. 2014 జూన్లోనే బెల్టు షాపులు ఉండనివ్వమని సంతకం పెట్టిన చంద్రబాబు ఇన్నేళ్లయినా వాటిని అరికట్టలేకపోయారి ఆమె అన్నారు. ఆయన ఎంత అసమర్థుడో ఈ విషయంతోనే అర్థమవుతోందని చెప్పారు. చంద్రబాబుని ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అంతా అంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.
ఏపీలో మహిళలు పోరాటం చేస్తున్నందుకు మళ్లీ ఇప్పుడు నెలరోజుల్లో బెల్టు షాపులను అరికడతామని మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. సంతకం పెట్టిన క్షణం నుంచి అమల్లోకిరావాల్సిన అంశాలు ఇప్పటికీ పూర్తి కాకపోవడంలేదని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాల్లో నాలుగు దిక్కులేకుండా పోయాయని విమర్శించారు.
ప్లీనరీలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలతో చంద్రబాబులో చలనం వచ్చిందని, అందుకే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్తుతున్నారని వెల్లడించారు. వైఎస్ జగన్ నవరత్నాల హామీతో చంద్రబాబు నవనాడులు చిట్లిపోయాయని ఎద్దేవా చేశారు. 10 రోజుల్లో బెల్ట్ షాపులు రద్దు చేయకపోతే తామే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు
అబద్ధాల్లో చంద్రబాబు పీజీ చేస్తే, లోకేశ్ పీహెచ్డీ చేశాడని పేర్కొన్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని, 37 నెలలుగా నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని వెళ్లాలని సూచించారు