ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. తెరపైకి కొత్త కొత్త మొఖాలు.. విభిన్న వాదనలు.. కొత్త కొత్త రాజకీయ అంశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒక భాగమే ప్రజాశాంతి పార్టీ. దాని అధ్యక్షుడు కేఏ పాల్. అవినీతి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ స్థాపించిన కేఏ పాల్.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తప్ప ఏపీకి వేరే దిక్కు లేదని.. ఏ రాజకీయ పార్టీ అయిన తన మద్దతు లేకపోతే చిత్తే అని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
తన భావాలకు అనుగుణంగానే పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమతో పొత్తు పెట్టుకోకుంటే జనసేనకు ఒక్క సీటు రాదని.. ఇప్పటికే పవన్ ఆలస్యం చేయకుండా తనను కలవాలన్నారు. ఇక ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబును కూడా పాల్ వదల్లేదు. అసలు ఏపీ రాష్ట్ర ఆదాయానికి, బడ్జెట్కు పొంతనే లేదని విమర్శించారు. ఏపీ ప్రస్తుత ఆదాయం కేవలం రూ. 1.5 లక్షల కోట్లని, బడ్జెట్ మాత్రం రూ.3.5 లక్షల కోట్లని పేర్కొన్న పాల్.. మిగతా రెండు లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి 5 లక్షల కోట్లు తెచ్చే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. ప్రజలను మోసం చేస్తూ చంద్రబాబు, మోదీ ఇంకేంతో కాలం అధికారంలో ఉండలేరన్నారు.