మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. మార్చి 10న జరిగే ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. దీంతో శివాజీ రాజా ప్యానెల్ – సీనియర్ నరేష్ ప్యానెల్ ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అయితే వీరిద్దరి వెనుక నలుగురు బిగ్ షాట్స్ తెర వెనక కథ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి.. మాజీ మా
అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్.. సూపర్ స్టార్ మహేష్… వేరొక మాజీ అధ్యక్షుడు మురళి మోహన్ ఇప్పుడు తెర వెనుక చక్రం తిప్పే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నరేష్ .. శివాజీ రాజాకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకోవడంతో వార్ మొదలైంది. శివాజీరాజాకు మెగాస్టార్ తరపున అండాదండా ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ శివాజీ రాజా గెలుపునకు బాటలు వేసింది చిరంజీవినే అంటారు. ఈసారి కూడా శివాజీ రాజా వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.
జీవిత రాజశేఖర్ బృందాన్ని బరిలో దించి నరేష్ సరికొత్త వార్ కి తెర తీశారు. అధ్యక్ష పదవి రేసులోకి వస్తూ మెగాస్టార్ వ్యతిరేకుల్ని నరేష్ కావాలనే తెరపైకి తీసుకొచ్చారని గుసగుసలాడుకుంటున్నారు. నరేష్ టీమ్ గెలుపు వెనక సూపర్ స్టార్ మహేష్ ఉంటారని తెలుస్తోంది. అయితే మహేష్ కి ఇలాంటి వ్యవహారాలు అంటే అస్సలు గిట్టదు. తనకు ఉన్న షెడ్యూల్స్ కూడా అందుకు సహకరించవు కూడా. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. ఇక మా మాజీ అధ్యక్షులు మురళిమోహన్, రాజేంద్ర ప్రసాద్ కచ్ఛితంగా శివాజీ రాజాకు వ్యతిరేకంగానే ఉంటారన్న చర్చా మరోవైపు సాగుతోంది. అంటే నరేష్ కి ఆ ఇద్దరూ సపోర్ట్ గా నిలిచే ఛాన్సుందన్న ముచ్చట సాగుతోంది. అయితే పేద ఆర్టిస్టులంతా శివాజీ రాజా వైపే మొగ్గు చూపడం శివాజీరాజాకు కలిసి వచ్చే అవకాశం. మరి మార్చి 10న జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో వేచి చూడాలి.