మల్టీస్టారర్ సినిమాలకు వచ్చే కిక్కు.. కలెక్షన్లు వేరు. నాటి తరం నుంచి నేటి తరం వరకు మల్టీస్టారర్ సినిమా అంటే ప్రేక్షకులతో పాటు అభిమానులకు పిచ్చే. అయితే సినిమా తీసే వాళ్లకే కష్టం. ఇద్దరు హీరోల డేట్లు, వాళ్ల రెమ్యునరేషన్, వారి అభిప్రాయాలు కలవడం వంటివి కష్టమే. అయినా అందరూ సమ్మతించి సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్టే. పాత తరం నుంచి కొత్త తరం వరకు ఆ పద్ధతి కొనసాగుతోంది. ఇప్పుడేమో ఆ ప్రాజెక్టులు క్రేజీగా అవుతున్నాయి. అలాంటి మల్టీస్టారర్ సినిమా గురించి మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. పైగా అతడు పలానా హీరోతో కలిసి నటిస్తున్నాడనే పుకార్లు ఎవరికీ లేనన్ని వస్తున్నాయి.
ఇటీవల ప్రిన్స్ మహేశ్బాబుతో కలిసి నటిస్తున్నాడని, రంగస్థలంలో నటిస్తున్నాడని, సైరా సినిమాలో ఓ పాత్ర ఉందని రకరకాల టాక్ వచ్చింది. అవేమీ లేవని ఆ హీరో కొట్టే పారేశాడు. అవన్నీ పుకార్లే. ఉంటే నేనే చెప్తా అని ప్రేక్షకులకు సమాచారం ఇచ్చాడు.
“మల్టీస్టారర్ మూవీస్ చేయడమంటే నాకూ ఇష్టమే. అలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నాను కూడా. కాకపోతే ప్రస్తుతానికైతే మెగాహీరోలతో కలిసి మాత్రమే మల్టీస్టారర్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. చరణ్, బన్నీతో కలిసి సినిమాలు చేసిన తర్వాత అప్పుడు మిగతా హీరోల సినిమాల్లో కూడా నటిస్తే బాగుంటుంది. నాకైతే రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఇష్టం.” మల్టీస్టారర్ సినిమాపై తేజ్ చెప్పాడు.