వరుస హిట్లతో దూసుకెళ్తున్న తార మెహ్రీన్కు ఓ దర్శకుడు సారీ చెప్పేశాడు. ఆమెకు అతడు సారీ చెప్పాల్సినంత ఏం జరిగింది? ఎందుకు ఆమెకు సారీ చెప్పాడు? అనే ప్రశ్నలు అందరిలో మెదలుతున్నాయి. విషయమేమంటే సుశీంద్రన్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం ‘నెంజిల్ తునివిరుందాల్(తమిళ్)’ తెలుగులో కేరాఫ్ సూర్య. సందీప్కిషన్, మెహ్రీన్ జంటగా నటించారు.
అయితే ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా నిడివి పెద్దగా ఉందని, పలు సన్నివేశాలు సినిమా వేగాన్ని తగ్గిస్తున్నాయని ప్రచారం జరిగింది. పలువురి నుంచి సలహాలు, సూచనలు కూడా వచ్చాయి. దీంతో సుశీంద్రన్ సినిమా నిడివి తగ్గించే ప్రయత్నం చేశారు. ఎలా కట్ చేయాలి, ఏ సీన్ తీయాలి అని తెగ మదన పడిపోయాడు. చివరికి కట్ చేసేసి చెప్పాడు. తీరా చూస్తే హీరోయిన్ మెహ్రీన్ ఉన్న సన్నివేశాలే ఎక్కువగా కోతకు గురయ్యాయి. కథానాయిక నటించిన సన్నివేశాలను తొలగించారు. దాదాపు 20 నిమిషాల సన్నివేశాలకు కత్తెర పడడంతో అతడు క్షమించమని కోరాడు.
దీనిపై సుశీంద్రన్ మాట్లాడుతూ ‘10వ తేదీన విడుదలైన ‘నెంజిల్ తునివిరుందాల్’ సినిమాకు అన్నివర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. కొన్ని సన్నివేశాలను తొలగిస్తే సినిమా మరింత వేగంగా ఉంటుందని కొందరు ప్రేక్షకులు, విశ్లేషకులు అభిప్రాయాలు తెలిపారు. వారి అందరీ సూచనలు దృష్టిలో ఉంచుకొని కొన్ని సన్నివేశాలను కత్తిరించేశాం. అయితే వాటిలో ప్రధానంగా మెహ్రీన్కు సంబంధించిన సన్నివేశాలన్నీ తొలగించాం. సినిమా విరామం, క్లైమాక్స్ సన్నివేశాలను కూడా మార్చాం’ అని ప్రకటించాడు. అయితే ఈ సినిమా కొత్త వెర్షన్ మంగళవారం నుంచి అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. దాదాపు 15 రోజులపాటు మెహ్రీన్కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించాం. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆమె సన్నివేశాలను తొలగించాం. దీనిపై ఆమెకు క్షమాపణలు తెలియజేసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.