విజయవాడ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. తాజాగా అంతర్గత పోరుతో ఎంపీ కేశినేని నాని టీడీపీకి దూరం కావడం దాదాపు ఖాయం కాగా త్వరలోనే ఎంపీ, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక ఇవాళ నాని కూతురు కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారి విజయవాడ రాజకీయాల గురించే ఏపీ వ్యాప్తంగా చర్చజరుగుతోండగా ఇటు కాంగ్రెస్లోనూ కదలిక మొదలైంది.
ఏపీలో పూర్వ వైభవం సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్. ఇందులో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల రీసెంట్గా కాంగ్రెస్లో చేరగా త్వరలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ సీటు కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ నెలకొంది.
కాపు వర్గానికి చెందిన నరహరిశెట్టి నరసింహారావు ,ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మ శ్రీ. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాదు తనకే అంటే తనకే అనుచరులతో చెప్పుకు వస్తున్నారు. ఇందులో నరసింహారావు సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా తనకే టికెట్ దక్కుతుందన్న విశ్వాసంతో ఉన్నారు.మరోవైపు మహిళా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న పద్మ శ్రీకి టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్నారు. మొత్తంగా విజయవాడ ఎంపీ రేసులో కాంగ్రెస్ రావడం కార్యకర్తల్లో జోష్ నింపుతోంది.