దేశంలోనే ఖరీదైన ఎన్నికలుగా ముద్రపడిన ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థులు గెలుపుకోసం తమ చేతికి ఎముకే లేకుండా ఖర్చు పెట్టారని వార్తలు వచ్చాయి. కోట్లు కుమ్మరించి గెలిచిన నేతలున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 100 కోట్ల కంటే కూడా ఎక్కువ ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఏపీ ఎన్నికల్లో నగదు ప్రవాహం నిజమేనని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ సర్వేలో తేల్చింది.
ఏపీలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలపై అధ్యయనం చేసిన ఆ సంస్థ దిమ్మదిరిగే వాస్తవాలు వెల్లడించింది. ఏపీలోని నాలుగు జిల్లాల్లో నగదు ఏరులై పారిందని అధ్యయనంలో తేల్చింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణ జిల్లా జిల్లాల్లో ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేలు పంచారని.. కొన్ని చోట్ల 7 వేల వరకు ఇచ్చినట్టు సీఎంఎస్ సంస్థ తేల్చింది.
ఇక గుంటూరు, విజయవాడ, విశాఖ, కడప, అనంతపురం లోక్ సభ నియోజకవర్గాల్లో భారీగా డబ్బు పంపిణీ జరిగిందని సంస్థ తేల్చింది. మొత్తం ఒక్కో పార్లమెంట్ లో కనీసం 100 కోట్లు ఖర్చు చేసినట్టు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది.
ఇలా నేతలు ఏపీలో గెలవడానికి చేతికి ఎముకే లేకుండా ఖర్చు చేశారని అర్థమవుతోంది. ఓటర్లను ప్రలోబ పెట్టడానికే ఈ మొత్తం ఖర్చు చేశారని స్పష్టమవుతోందని సంస్థ పేర్కొంది.