ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయనందుకు కేంద్రం వైఖరికి నిరసనగా హోదా సాధన సమితి చేపట్టిన బంద్తో జనజీవనం స్తంభించింది.బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు టీడీపీ, బీజేపీ మినహా మిగతా రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడంతో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు సోమవారం తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
విద్య, వ్యాపార సంస్థలు సైతం తమ మద్దతు ప్రకటించడంతో మూతపడ్డాయి. జనసేన, వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నాయకులు బంద్లో పాల్గొంటున్నారు. బంద్ సందర్భంగా తన పాదయాత్రకు వైసీపీ అధినేత జగన్ విరామం ప్రకటించారు. సోమవారం జరగాల్సిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో జరగాల్సిన వార్షిక పరీక్షలను వాయిదా వేశారు. చాలాచోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేశారు.
తెల్లవారుజామునే అఖిలపక్ష నేతలు బస్డిపోల వద్ద బైటాయించడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోదా కోసం చేపట్టిన బంద్ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల్లోనూ చిన్న చిన్ని ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితం అవ్వడతో జనజీవనం స్తంభించింది. ప్రైవేటు వాహనాలను సైతం ఆందోళనకారులు అడ్డుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.పెట్రోలు బంకులు, సినిమా హాళ్లు సైతం మూతపడ్డాయి.