ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. ఈ కోడి పందేలు నిర్వహించడం సరికాదు అని చట్టసభలు తీర్పులు ఇచ్చాయి. జీవాలను హింసించడం నేరం.. మహాపాపంగా పేర్కొంటూ కోడిపందేలపై నిషేధం విధించాయి. అయినా మనోళ్లు వింటేగా యథేచ్చగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ కోడిపందేలు నిర్వహించుకుంటున్నారు. పాలక ప్రభుత్వం కూడా చూసీచూడనట్టు ఉండడం.. కోళ్లపందేల్లో స్వయంగా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్వేచ్ఛగా పాల్గొంటారు. ఇది సర్వసాధారణం.
ఇక వీటిని నిర్వహించుకోవచ్చని ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రకటించారు. మూడు రోజుల పాటు కోడిపందేలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. చట్టాలను గౌరవిస్తూనే.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. ఇలా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏకంగా రాష్ట్ర హోంమంత్రి మాట్లాడితే ఎలా అని జీవ ప్రేమికులు విమర్శిస్తున్నారు.