దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం నేడు తుది దశకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి లలో మొత్తం 475 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో జరుగుతుండగా, అసోంలో ఆఖది దశ, పశ్చిమ బెంగాల్లో మూడవ దశ పోలింగ్ జరుగుతోంది.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు సురక్షితంగా ఓటుసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పశ్చిమ బెంగాల్లో మూడో దశలో భాగంగా మంగళవారం 31 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 2న ప్రకటించనున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకె, డీఎంకెలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ తలపడుతున్నాయి.
పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య పోరు నెలకొంది. కాగా, నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లపై హామీలు గుప్పించాయి.