విజయవాడ: నోట్ల రద్దు వ్యవహారం దేశంలో ఇప్పుడు ఓ సంచలన విషయం. దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో విమర్శించేవాళ్లు ఒకవైపు, పొగిడేవాళ్లు మరోవైపు. అయితే ఈ నేపథ్యంలో మోడీకి ఆ సలహా ఇచ్చింది చంద్రబాబే అన్న వాదనలు వినిపిస్తుండగా దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు.
చంద్రబాబు ఇచ్చిన దిక్కుమాలిన సలహా వల్లే మోడీ కష్టాల్లో పడ్డారని అన్నారు. రాష్టంలో అందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొదట మోడీకి ఆ సలహా ఇచ్చింది తామేనని చెప్పకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు చంద్రబాబుతో సహా మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందుగా తమను సంప్రదించాల్సిందని అంటున్నారని విమర్శించారు. మంచి జరిగితే తమకు అనుకూలంగా చెడు జరిగితే బీజేపీ వైపు నెట్టడానికి టీడీపీ పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు. చంద్రబాబు ఎన్డిఏ భాగస్వామి అన్న సంగతిని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంతా డ్రామా అంటూ టీడీపీ నాయకులను ఆయన విమర్శించారు అంబటి రాంబాబు.