కేంద్రం – రాష్ట్రం కలిసి ఏపీ వ్యవహరాల మీద నడిపిస్తున్న తీరు గురించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పెద్ద నోట్ల రద్దు తరవాత సామాన్యుల ఇబ్బందులు చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు ఆయన. ప్రధాని చెప్పిన యాభై రోజులు పూర్తి అయినా కూడా ఇంకా కష్టాలు తీరనేలేదు అన్నారు రామ కృష్ణ.కనీసం ఇప్పటికైనా ఇబ్బందులు సరిదిద్దే చర్యలు చేపట్టకుండా దీనివల్ల అద్భుత ఫలితాలు వస్తాయని – ప్రజలు హరిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య మొండిగా వాదించడం – మోడీ – చంద్రబాబులను చరిత్ర పురుషులుగా పొగడడం విడ్డూరంగా ఉందన్నారు.
వారు చరిత్ర పురుషులో? కాదో? ప్రజలే తేలుస్తారు కాని వెంకయ్య మాత్రం డబ్బా పురుషుడిగా నిల్చిపోయారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. సహజంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం లేదా ప్రారంభించడం చూశాం కాని అర్థపర్థం లేకుండా కాంక్రీటు పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని ఓ పెద్ద ఉత్సవంలా నిర్వహించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన ఇలాగే చేశారని రామకృష్ణ గుర్తుచేశారు.
తన స్వంత కుటుంబ వ్యవహారంలా భార్యాభర్తలు – కుటుంబసభ్యులతో కల్సి బొడ్డురాయికి ఒకసారి- రాజధానికి మరోసారి- పరిపాలనా భవనానికి ఇంకోసారి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రీతిలో పట్టిసీమ ఎత్తిపోతల విషయంలో సైతం కేవలం పబ్లిసిటీయే లక్ష్యంగా ప్రతి పంపుకో ప్రోగ్రాం పెట్టి డబ్బు దుబారా చేశారని రామకృష్ణ విమర్శించారు.