ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ రాష్ట్రాలకు ఫిబ్రవరిలో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ప్రధాన ఎన్నికల అధికారి అచల్ కుమార్ జోతి గురువారం (జనవరి 18వ తేదీ) ప్రకటించారు. ఫిబ్రవరి 18న త్రిపుర, 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్కు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3వ తేదీన మూడు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించనున్నారు.
మార్చి 6వ తేదీతో మేఘాలయ, మార్చి 13వ తేదీతో నాగాలాండ్, 14వ తేదీతో త్రిపుర రాష్ట్రాలో ప్రస్తుత పాలన కాలం పూర్తికానుంది. దీంతో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ప్రణాళికలు వేశారు. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాలుగా ఉండడంతో ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు సీఈసీ అచల్ కుమార్ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల కోడ్ నేటి నుంచే (జనవరి 18వ తేదీ) అమల్లోకి వచ్చింది. మూడు రాష్ట్రాల్లోనూ ఈవీఎం, వీవీప్యాట్ పరికరాలతో ఎన్నికలు నిర్వహించనున్నారు.
అసెంబ్లీ సీట్లు.. ప్రస్తుత పార్టీల బలాలు
త్రిపుర అసెంబ్లీ స్థానాలు – 60
సీపీఎం – 50
సీపీఐ – 1
బీజేపీ – 7
కాంగ్రెస్- 2
నాగాలాండ్ – 60
ఎన్పీఎఫ్ – 45
బీజేపీ – 4
జేడీ (యూ) – 1
ఎన్సీపీ -1
స్వతంత్రులు -8
ఖాళీలు -1
మేఘాలయ – 60
కాంగ్రెస్ -24
యూడీపీ – 7
హెచ్ఎస్పీడీపీ -4
బీజేపీ -2
ఎన్సీపీ -2
ఎన్పీపీ -2
ఎన్ఈఎస్డీపీ -1
స్వతంత్రులు -9
ఖాళీలు 9