యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. బొమ్మల రామారం మండలం మైసిరెడ్డిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఫేర్ వెల్ పార్టీ అనంతరం కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటికి తిరిగి వెళుతుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువతులు సహా నలుగురు బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో కారు గంటకు 120-150 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు నిర్ధరించారు.
ప్రమాదానికి గురైన విద్యార్థులు హైద్రాబాద్ ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కళాశాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా బొమ్మల రామారంలోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొద్దుపోయె దాక పార్టీ చేసుకొని కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం.
మృతులు చైతన్య రెడ్డిది సరూర్నగర్లో గాయత్రినగర్ కాగా, స్ఫూర్తిది ఎల్బీనగర్, మిగతా ఇద్దరి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వినయ్, మనీశ్ రెడ్డిలను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కారులో పలు మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో కారును నడపడంతోనే కారు అదుపు తప్పి ప్రమాదం జరిగిఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.