ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్న కుల పిచ్చి మాత్రం జనాల్ని వదలడం లేదు. తాజాగా దేశంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. వేరే కులం యువకున్ని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహం కన్నకుమార్తెపై ప్రేమను చంపేసింది. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని తల్లిదండ్రులు కూతురు, అల్లుడిని కత్తులతో నరికి కిరాతకంగా హతమార్చారు.
వివరాల్లోకి వెల్తే..హోసూరు-బేరికె రహదారిలోని వెంకటేషపురం చూడగొండపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నందీశ్(25) హోసూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా పని చేసేవాడు. హోసూరులోనే నివాసం ఉంటూ స్థానిక యువతి స్వాతి(21)ని ప్రేమించాడు.
పెల్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయాన్ని వీరిద్దరు నందీశ్, స్వాతి తమ ఇంట్లో వాళ్లకు తెలిపారు. అయితే ఇరువురి కులాలు వేరుకావడంతో స్వాతి తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. దీంతో కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా స్వాతి 3 నెలల క్రితం నందీశ్ ను పెళ్లి చేసుకుంది.
తీవ్ర ఆగ్రహానికి లోనైన స్వాతి కుటుంబ సభ్యులు ఆమెను చంపేయాలని ప్రణాళిక వేశారు. సడెన్ గా కొద్ది రోజుల క్రితం వీరు అదృశ్యమయ్యారు. ఈ విషయమై నందీశ్ సోదరుడు శంకర్ హోసూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టరు లక్ష్మణదాస్ కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. చివరకు మాండ్య జిల్లా మల్లహళ్ళి శివారులోని కావేరి నదిలో విగతజీవులుగా ఉన్న ఓ జంటను గుర్తించారు.
వీరు హత్యకు గురైనట్లు మండ్య పోలీసులు కేసు నమోదు చేసి హోసూరు పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. వీరిని వేరేచోట దారుణంగా హతమార్చి కాళ్లు, చేతులను తాడుతో కట్టి నదిలో విసిరేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ జంట హత్యల నేపథ్యంలో యువతి తండ్రి సహా ముగ్గురు నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ హత్యకు కుట్ర పన్ని పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం అధికారులు గాలిస్తున్నారు.