దేశం మొత్తం మీద ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు ఉన్న ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఓ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్లో భాగ్యనగరం ప్రథమ స్థానం దక్కించుకుంది. ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018’ పేరుతో మెర్సర్ ఇయర్లీ రిపోర్ట్ను ఇటీవల విడుదల చేసింది. ఎప్పటిమాదిరిగానే హైదరాబాద్ దేశంలోనే జీవించేందుకు ఉత్తమ నగరంగా కీర్తి గడించింది.
ఆ సంస్థ ప్రకటించిన ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ప్రథమ ర్యాంక్ పొందడం వరుసగా ఇది నాలుగోసారి. తక్కువ నేరాలు, అన్ని కాలాల్లోనూ ఆహ్లాదకర వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ను ఎంపిక చేశారు అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలోని పుణె కూడా హైదరాబాద్ తర్వాత చోటు దక్కించికుంది.
అయితే ఈ లిస్ట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీ లాస్ట్లో నిలిచింది. తీవ్ర కాలుష్యం, భారీ ట్రాఫిక్తో ఢల్లీ ఈ లిస్ట్లో చివరన ఉండిపోయింది. ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు సిటీలు హైదరాబాద్ తర్వాతనే చోటుదక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జీవించడానికి ఉత్తమమైన నగరాల జాబితాలో ఉన్న సిటీ హైదరాబాద్ 142వ ర్యాంక్ దక్కించుకుంది.
హైదరాబాద్ 142, పుణె 142, బెంగళూరు 149, చెన్నై 151, ముంబయి 154, కోల్కతా 160, ఢిల్లీ 162 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సిటీ ఆస్ట్రియా రాజధాని వియన్నా. దీని తర్వాత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ రెండో ర్యాంక్ సంపాదించుకుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్ 3, సింగపూర్ 25, పారిస్ 39, లండన్ 41, న్యూయార్క్ 45, వాషింగ్టన్ 48, దుబాయ్ 74 ర్యాంకుల్లో నిలిచాయి.