నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాను వణికించిన భూకంపం, సునీమీనుంచి కోలుకో ముందే మరో భూకంపం ఆదేశాన్ని అతలా కుతలం చేసింది. సులవేసి దీవి ఇప్పటికే నామరూపాలు లేకుండా పోగా, తాజాగా వచ్చిన భూకంపం సుంబాదీవిని అల్లాడించింది. ఈ తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం రాగా, వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి.
తొలుత రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 15 నిమిషాల్లోపే మరోసారి రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సులవేసి దక్షిణాన 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంబా దీవిలో 7.5 లక్షల మంది జనాభా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు శుక్రవారం సులవేసి ద్వీపాన్ని అతలాకుతలం చేసిన సునామీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే అధికారంగా 832 మంది చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య దాదాపు 1200కు చెరినట్టుగా తెలుస్తోంది.