జైషే మమహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చనిపోయాడంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై స్పందించారు మసూద్ అజార్. తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని…తన ఆరోగ్యంపై వస్తున్నవన్నీ పుకార్లేనని పేర్కొన్నాడు. మరో వైపు పాకిస్థాన్ కు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత ప్రపంచ దేశాలనుంచి వస్తున్న ఒత్తిడితో పాక్ ప్రభుత్వం ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకుంటోంది.నిషేధిత ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా 182 మదర్సాలను నియంత్రణలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. 121 మందికి పైగా ఉగ్రవాద సంస్థలకు చెందినవారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
బుధవారం రాత్రి జైషే మహ్మద్కి చెందిన వెబ్సైట్లో అతడు ఓ ఆడియో క్లిప్ పోస్టు చేసినట్టు ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ వెల్లడించింది. ఈ ఆడియోలో భారత్, పుల్వామా దాడి సహా పాకిస్తాన్లోని ఉదారవాదుల గురించి అజార్ ప్రస్తావించాడు. కశ్మీర్లో భారత్కు వ్యతిరేకంగా జీహాద్ మొదలుపెట్టాలంటూ తన అనుచరులకు పిలుపునిచ్చాడు.
మసీదులు, ముస్లింలపై పాక్ ప్రభుత్వం చేస్తున్న విచారణను వెంటనే నిలిపి వేయాలని మసూద్ హెచ్చరించాడు. పాకిస్థాన్ ముస్లిం దేశమని… మలాలా వంటి ఉదారవాదుల చేతుల్లోకి దేశాన్ని పోనివ్వరాదని అన్నాడు .జైషే మహ్మద్తో తమ అధికారులు సంప్రదింపులు జరిపారంటూ ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపైన కూడా మసూద్ అజర్ స్పందించాడు. ఒత్తిడితోనే పాకిస్తాన్ ఈ మాటలు చెబుతోందనీ.. కానీ అవేవీ తమ ముందు పనిచేయవని అన్నాడు. జైషే మహ్మద్ను ఉన్నది ఉన్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించి తీరాలని స్పష్టం చేశాడు.