టీడీపీ నేతలకు కేవీపీ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయినిగా పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతుండడం.. 25 శాతం కూడా పనులు ముందుకు కదలకపోవడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అటు పార్లమెంట్లోనూ.. ఇటు రాష్ట్రంలో పోరాడుతోంది. అయితే ఈ పనులపై అధికార పక్షం తెలుగు దేశం పార్టీ కేవీపీ రామ్చంద్రరావుపై విమర్శలు గుప్పించాయి. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనేనని, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని విమర్శలు చేసింది. దీనిపై కేవీపీ స్పందించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి పశ్చిమ గోదావరి పోలవరం దాకా పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను పాండిచ్చేరి ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పట్టిసీమ నుంచి పాదయాత్రగా పోలవరం చేరుకున్న కాంగ్రెస్ నాయకులు పోలవరం గ్రామంలోని భాను ధియేటర్ వద్ద సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి స్పిల్ వే నిర్మాణ ప్రాంతంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ముగింపు సందర్భంగా ఎంపీ కేవీపీ రామచంద్రరావు సవాల్ విసిరారు.
“దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రలో నీటి విలువ తెలుసుకుని – పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాను అడ్డుకుంటున్నానని తెలుగుదేశం వారు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. చట్టప్రకారం నిర్మాణానికి పూర్తినిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మాత్రమే కోర్టులో కేసు వేసినట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వారు చేసిన ఆరోపణ నిరూపిస్తే రెండున్నరేళ్లు ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనని కేవీపీ సంచలన సవాల్ చేశారు.`