ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకస్మిక పాక్ పర్యటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. మరీ, ముఖ్యంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేనుకు ఈ పర్యటన చిర్రెత్తిస్తోంది. ప్రధాని పాక్ పర్యటనను తీవ్రంగా తప్పుపడుతోంది. అంతేకాదు, ప్రధాని పాక్ గడ్డను ముద్దాడటంపై మండిపడుతోంది.
పాక్ విషయంలో మోడీ అనుసరిస్తున్న తీరును సరైంది కాదని సొంత పత్రిక సామ్నాలో తీవ్రంగా విరుచుకుపడింది. పాక్ గడ్డను ముద్దాడిన మోడీ సమీప భవిష్యత్తులోనే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ పత్రిక ఎడిటోరియల్ ద్వారా శివసేన అభిప్రాయపడింది. అంతేకాదు, గతంలో కొందరు భాజపా నాయకులు పాక్ విషయంలో అనుసరించిన తీరుపై కూడా విమర్శలు చేసింది. పాక్ పర్యటించి వచ్చిన ఏ భాజపా నేతల కెరీర్ గ్రాఫ్ తీసుకున్నా పతనం దిశగా పయనించిందనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది.
మహ్మద్ అలీజిన్నా సమాధిని గతంలో ఎల్కే అద్వానీ ఓసారి సందర్శించారనీ, ఆయనకి నివాళులు అర్పిస్తూ గొప్పగా మాట్లాడారనీ… ఆ తరువాత ఆయన పొలిటికల్ కెరీర్ పతనవైపు అడుగులు వేసిందని శివసేన అభిప్రాయపడింది. అద్వానీ పతనానికి నాంది అక్కడే పడిందని చెప్పింది. అలాగే, వాజ్ పెయి కెరీర్ కూడా పాక్ వల్లే నాశనం అయిందని చెప్పుకొచ్చింది.
లాహోర్తో బస్సు దౌత్యం నెరిపి, పాక్ నియంత అయిన ముష్రాఫ్తో ఆగ్రాలో చర్చలు జరిపారని గుర్తు చేసింది. పాక్ విషయంలో ఇలా వ్యవహిరించిన తరువాత వాజ్పెయి నేతృత్వంలో భాజపా అధికారంలోకి రాలేదనీ, ఆయన పొలిటికల్ గ్రాఫ్ కూడా అక్కడి నుంచే పడిపోయిందని వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ కూడా వారిలానే వ్యవహరిస్తున్నారనీ, పాక్ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు భారత్ ప్రజలు బుద్ధి చెబుతారనీ, మోడీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సేన ఆవేదన వ్యక్తం చేస్తోంది.అంతేకాదు, హటాత్తుగా పాక్కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ప్రశ్నించింది.
ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండీ… భాజపా విపక్షంలో ఉంటే… మోడీ మాదిరిగానే ఎలాంటి ముందస్తు మేథోమధనం జరగకుండా కాంగ్రెస్ ప్రధాని పాక్కు వెళ్తే భాజపా స్పందించకుండా ఉంటుందా అని సేన ప్రశ్నించింది.