కొంత మంది మూఢ నమ్మకాలను చూస్తుంటే అసలు మనం మనుషుల మద్య ఉన్నామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతున్నా ఇప్పటికీ కొంత మంది మనుషులు మూఢనమ్మకాలను నమ్మి వాటికోసం ప్రాణాలు కూడా అర్పిస్తారు. తాజాగా ఓ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఏకంగా 25 రోజులు గడిపారు. ఓ మహిళా పోలీస్ లీవ్ పెట్టి వెళ్లింది.. ఆమె లీవ్ పూర్తయినా ఇంకా విధులకు హాజరు కాకపోవడంతో ఇద్దరు మహిళా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిస్థితి చూసి షాక్ తిన్నారు.
వివరాల్లోకి వెళితే.. పోలీసు కంట్రోల్రూంలో పనిచేసే తమిళనాడులోని టీ.నగర్లోని దిండుగల్ నందవనపట్టికి చెందిన మహిళ అన్నై ఇందిర (38) భర్తను విడిచి తన బిడ్డతోపాటు అక్క వద్ద ఉంటోంది. ఇటీవల ఆమెకు ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించకుండా ఆమె కుటుంబ సభ్యులు మృతదేహంతో 25 రోజులుగా ప్రార్థనలు నిర్వహించారు.
కాగా, ఏసుక్రీస్తు మాదిరిగా చనిపోయిన ఆ మహిళ మళ్లీ జన్మిస్తుందని భావించి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. డిసెంబరు 7నే ఆమె మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. దీంతో మృతురాలి అక్కతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు.
