ప్రజల సమస్యలను నేరుగా ఫోన్ చేసి చెబితే వెంటనే పరిష్కారం చూపుతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందట 1100 కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. విజయవాడకు సమీపంలో ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఓ భారీ భవంతిలో ఈ 1100 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 200 మందికి పైగా ఉద్యోగులతో ఈ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. వీళ్లు చేయాల్సిందల్లా ప్రజలకు ఫోన్ చేసి.. ప్రభుత్వ పాలన ఎలా ఉంది, పథకాలు అమలు జరిగా జరుగుతున్నాయా.. లేదా వంటి వివరాలు తెలుసుకుంటారు. దీనికితోడు ప్రజలు తమ సమస్యలను నేరుగా 1100కు ఫోన్ చేసి చెబితే సంబంధిత ప్రభుత్వ విభాగంతో కాల్సెంటర్ ద్వారా మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తారు. ఇది పెట్టి ఏడాదిలో ఇటునుంచి వెళ్లిన, ప్రజల నుంచి వచ్చిన కాల్స్ 40 కోట్లు దాటాయని లెక్కలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదిలో ప్రజల నుంచి 1100 కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులు 16.33లక్షలున్నాయని, వాటిలో 98శాతం పరిష్కరించినట్టు లెక్కలు చెబుతున్నారు. కానీ.. వాస్తవంగా జరుగుతున్నది వేరు.
బాధితుల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే సదరు సమస్యను.. సంబంధిత విభాగానికి ఈ కాల్ సెంటర్ ద్వారా చేరవేస్తున్నారు. ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాధితులను సంబంధిత విభాగానికి అటాచ్ చేసి పరిష్కరించాలని సూచిస్తున్నారంతే. ఆ తర్వాత పరిష్కరిచండం, పరిష్కరించకపోవడం.. అక్కడి అధికారులు, సిబ్బంది చేతిలో ఉంటోంది. చాలావరకూ సమస్యను పరిష్కరిస్తాం.. మళ్లీ రమ్మంటూ పంపేస్తున్నవాళ్లే ఎక్కువ ఉంటున్నారు. అంతే తప్ప ఎలాంటి సమస్యనైనా తక్షణం పరిష్కరించేసే పరిస్థితి లేదనేది వాస్తవం. నిజంగా.. ప్రతి సమస్యనూ కాల్ సెంటర్ ద్వారా పరిష్కరించి ఉంటే.. ప్రజలు ఇప్పటికీ తహశీల్దార్, ఆర్ఐవోల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు. ఇప్పటికీ ప్రభుత్వ ఆఫీసులో పని జరగాలంటే వాళ్లు అడిగిన మొత్తం ఇస్తేనే సాధ్యమవుతోంది. అంతే తప్ప.. ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేసేందుకే కాల్ సెంటర్ను పెట్టాం.. అది 98శాతం సత్ఫలితాలు ఇస్తోందని చెబుతున్నది అపోహే.