ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్ అభ్యర్థనపై ఢిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్కు గుండె తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా అంబులెన్స్ వెళ్లేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. దీంతో 18.5 కి.మీల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకోగలిగింది.
గుజరాత్లోని వడోదర నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్దకు గుండెను తీసుకొస్తున్నట్టు ఎయిమ్స్ వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స కోసం సమయం వృథా కాకుండా త్వరగా తీసుకొచ్చేలా సహకరించాలని పోలీసులను కోరారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. దీనికోసం అధికారులను నియమించి గ్రీన్ కారిడార్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
విమానాశ్రయం నుంచి అంబులెన్స్ వెళ్లేందుకు జాప్యం జరగకుండా గురువారం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు టెర్మినల్ 2 నుంచి పైలెట్గా ఎయిమ్స్ వరకు వచ్చారు. దీంతో వాహనాలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ రహదారుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్ కేవలం 12 నిమిషాల్లోనే ఆస్పత్రికి చేరుకోగలిగింది. మామూలుగా అయితే విమానాశ్రయం నుంచి ఎయిమ్స్కు రావాలంటే 35 నుంచి 40 నిమిషాలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.