అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కొంత కష్టసాధ్యమైనదే. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. మనదేశంలోనే రెండు కంపెనీలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి గణనీయంగా సాగడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగుతోంది. మనదేశానికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇండియా అంగీకరిస్తే అమెరికా నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తామంటూ అమెరికా ప్రకటించింది.
ఈ మేరకు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్ ఫ్రైస్ ఓ ప్రకటన చేశారు.వ్యాక్సిన్ డోసులు తీసుకొనేందుకు భారత్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. టీకాలు విదేశాల నుంచి స్వీకరించే విషయంలో భారత్ చట్టపరమైన అంశాలను పరిశీలిస్తోందని ఆయన అన్నారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా భారీ ఎత్తున వ్యాక్సిన్ డోసులను నిల్వ చేసుకున్నది. వీటిలో 80 మిలియన్ డోసులు వివిధ దేశాలకు పంపేందుకు అధ్యక్షుడు బైడెన్ అంగీకారం తెలిపారు.
దీంతో నేపాల్, పాకిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు 40 మిలియన్ డోసుల టీకాల పంపిణీ చేయాలని ఆ దేశం నిర్ణయించుకున్నది.అయితే ఈ విషయంపై అమెరికా విదేశాంగ ప్రతినిధులు మాట్లాడుతూ.. ’ ప్రస్తుతం ఇండియా ఫార్మా రంగంలో దూసుకుపోతున్నది. ఆ దేశం స్వయంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నది. విదేశాలకు కూడా పంపుతున్నది’ అని పేర్కొన్నారు. కాగా అమెరికాలో ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న విషయం తెలిసిందే.
Also Read
భారత్లో తొలి కరోనా పేషెంట్కు మళ్లీ పాజిటివ్..!