మనదేశంలో తొలి కరోనా కేసు కేరళలోని త్రిస్సూరులో నమోదైన విషయం తెలిసిందే. త్రిస్సూరుకు చెందిన ఓ యువతి చైనాలోని వుహాన్ లో వైద్య విద్య అభ్యసించేది. అయితే వూహాన్ లో కరోనా విజృంభించడంతో ఆమె ఇండియాకు వచ్చింది. ఇక్కడ పరీక్షలు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేశారు. మొత్తానికి 3 వారాలకు ఆమె కోలుకున్నది.
ఇలా దేశంలో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత విదేశాల నుంచి రాకపోకలు తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. దేశంలో మొదటి సారి కరోనా బారిన పడ్డ యువతికి మరోసారి కరోనా సోకింది. ఇటీవల సదరు యువతి ఢిల్లీ వెళ్లాలని భావించింది. ఇందుకోసం కరోనా పరీక్షలు చేయించుకోగా .. ఆమెకు పాజిటివ్ అని తేలింది.
అయితే ఆ యువతికి పెద్దగా లక్షణాలు ఏమీ లేవని వైద్యులు తెలిపారు. సాధారణంగా కరోనా రెండోసారి సోకే అవకాశం తక్కువని వైద్యులు చెబుతుంటారు. కానీ మనదేశంలో కరోనా రెండో సారి కూడా సోకుతోంది. అందుకు కారణం ప్రస్తుతం వివిధ రకాల వేరియంట్లు విజృంభించడమే. మనదేశంలో కరోనా రీ ఇన్ఫెక్షన్ 4.5 శాతంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా రెండో సారి సోకుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు థర్డ్వేవ్ పై కూడా వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ సాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.
Also Read
థర్డ్వేవ్ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన