ప్రధాని నరేంద్ర మోదీపై వీహెచ్పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తోగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ముస్లింలకు వకల్తా పుచ్చుకుంటారా అంటూ ప్రశ్నించారు.ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాక్ దురాచారం నిర్మూలనకు మోదీ ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదివారి వ్యక్తిగతవిషయమని అందులో ప్రధాని జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.
హిందూవాదం, హిందుత్వ నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం హిందువులకు కీలకమైన రామ మందిర నిర్మాణంపై మాత్రం ఎలాంటి చర్య తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భాజాపా అధికారంలో ఉండికూడా రామమందిర నిర్మానం చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని పార్లమెంట్ అందుకు తగిన చట్టాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో నెగ్గిన ఆయన, హిందూ దేశ పరిరక్షణ, కశ్మీర్ లోని హిందువులను రక్షించడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామమందిరం నిర్మించకపోవడం మోదీ అసమర్ధతకు నిదర్శనమని అన్నారు.
ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన చట్టాలు, వాటి సవరణల విషయంలో మాత్రం మోదీకి పార్లమెంట్ గుర్తొస్తుందని.. కానీ అయోధ్య వివాదంలో మాత్రం సుప్రీంకోర్టు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే రామ మందిరం నిర్మించాలన్న ఆలోచన కూడా మోదీకి లేదని విమర్శించారు. వందల మంది తమ కార్యకర్తలు అక్టోబర్ 21న ర్యాలీగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి బయలుదేరతారని వెల్లడించారు. రాఫెల్ ఒప్పందంపై సైతం తొగాడియా స్పందించారు. రాఫెల్ యుద్ధ విమానాలను ఎంతకు కొనుగోలు చేశారన్నది తెలుసుకోవడం దేశ ప్రతి పౌరుడి హక్కు అని పేర్కొన్నారు.