ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారానికి నాలుగో రోజుకు చేరింది. అయితే నిరాహార దీక్షలో కూర్చుని దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. సుబ్బారెడ్డిని సోమవారం ఉదయం పరిశీలించిన వైద్యులు ఆయన దీక్ష కొనసాగిస్తే ప్రమాదం అని చెప్పారు.
దీక్ష విరమించాలని పలువురు కోరినా సుబ్బారెడ్డి ససేమిరా అన్నారు. అయితే వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. తొలుత ఫ్లూయిడ్స్ వద్దని, దీక్ష కొనసాగిస్తానని సుబ్బారెడ్డి చెప్పారు.
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి షుగర్ లెవల్స్ 66 పాయింట్లకు పడిపోయి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించి సుబ్బారెడ్డి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుబ్బారెడ్డికి పూర్తిగా డీహైడ్రేషన్కు గురయ్యారని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించే సమయంలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వరప్రసాద్ రావులను ఇప్పటికే బలవంతంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.