ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దిశ యాప్పై పూర్తి చైతన్యం కలిగించాలని సీఎం సూచించారు. దిశ యాప్ ను ఎలా వాడాలన్నదానిపై అవగాహన కలిగించాలన్న సీఎం, ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసేలా చూడాలని ఆదేశించారు. దీనిలో భాగంగా దిశ యాప్ పై ముందుగా మహిళా పోలీసులు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ వాడకంపై కాలేజీలు, విద్యా సంస్థల్లోనూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మహిళల భద్రతపై సీఎం వైయస్ జగన్ ఇవాళ అమరావతిలో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి, సీఎంఓ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెను వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంకావాలని సీఎం అన్నారు. దిశ పోలీస్స్టేషన్లు, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధంచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలని సీఎం చెప్పారు.